ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయండి...
ఎన్నికలు స్వేచ్ఛగా ప్రశాంతంగా జరిపించండి...
జిల్లా కలెక్టర్, ఎస్.పి. లకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐ. వి. వినతి...
ప్రలోభాలు, వత్తిడి లను లెక్కచేయకుండా ఉభయగోదావరి జిల్లాల అధ్యాపక, ఉపాధ్యాయ ఓటర్లు పెద్దల సభ ఔన్నత్యాన్ని, ఉపాధ్యాయుల గౌరవాన్ని నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేసిన ఐవి.....
కాకినాడ, మార్చి 13; మార్చి 14 న జరుగబోతున్న తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేసి , ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిపించాలని జిల్లా కలెక్టర్, ఎస్.పి. లకు ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు (ఐ.వి.) వినతి పత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఐవి మాట్లాడుతూ మార్చి 12 సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం గంధం నారాయణరావు అనే అభ్యర్థికి చెందిన కొంతమంది వ్యక్తులు ఉభయగోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కార్లలో, ఆటోలలో ట్రావెలింగ్ బ్యాగ్ లు వేసికొని ఎమ్మెల్సీ ఓటర్లకు పంపిణీ చేస్తూ ప్రలోభ పరుస్తున్నారని పేర్కొన్నారు. కాకినాడ, అమలాపురం, రావులపాలెం వంటి ప్రాంతాల్లో తమ కార్యకర్తలు పంపిణీలను అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అయితే కొన్ని చోట్ల బ్యాగ్ లు పంపిణీ చేస్తున్న వ్యక్తులే తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వాపోయారు. ఈరోజు, రేపు కూడా బ్యాగులు, నగదు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అధికారులు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నామన్నారు. అలాగే పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల వద్ద కొంత మంది అలజడి సృష్టించే అవకాశం ఉందని, దానిని నిరోధించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిపించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఐవి కోరారు. కలెక్టర్, ఎస్.పి. లతో ఫోన్ లో మాట్లాడగా తగిన చర్యలు తీసుకుంటామని , యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి పెట్రోలింగ్ చేయిస్తామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయం లో డిఆర్ఓ సిహెచ్. సత్తిబాబు కు, ఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ అంబికా ప్రసాద్ కు స్వయం గా వినతి పత్రాలు సమర్పించారు. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, వత్తిడి చేసినా ఉభయగోదావరి జిల్లాల అధ్యాపక, ఉపాధ్యాయులు పెద్దల సభ ఔన్నత్యాన్ని, ఉపాధ్యాయుల గౌరవాన్ని నిలబెడతారని ఐవి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పలివెల వీరబాబు, టి. రాజా, మణికంఠ, దినేష్ తదితరులు పాల్గొన్నారు...